Moral Story : దొంగోడు జారిపడ్డాడు

దొంగోడు జారిపడ్డాడు

 

దొంగోడు జారిపడ్డాడు

( అనుమానం పెనుభూతం సామెతకు కథ)

మౌర్య సామ్రాజ్యాన్ని సామ్రాట్ అశోకుడు పరి పాలించిన 37 సంవత్సరాలలో  రాజ్యం సుభిక్షంగా ఉండడం కోసం చాలా కొత్త కొత్త మార్పులు జరిగాయి.
ప్రజల ధనసంపాదన కోసం ఆర్థికసంస్కరణల ఏర్పాట్లు జరిగాయి,  ప్రజారోగ్య అభివృద్ధి దృష్ట్యా విభిన్న  తీర్పుమందిరాల స్థాపనలు జరిగాయి.
దానితోపాటు ప్రజల జీవన విధానాలు పూర్తిగా మారాయి.
కానీ రాజు గారికి  రాజ్యంలో ఏదో వెలితిగా ఉన్నట్లు అనిపించింది. ప్రజలు  నూటికి నూరు మంది క్షేమంగా ఉండాలన్నది ఆయన అభిమతం.
 ఒక వర్గం తనకు భయపడుతున్నారని, తనను శత్రువుగా చూస్తూ జీవితం వెళ్లబుచ్చు తున్నారు.’అని   అశోకుడు వేగుల ద్వారా తెలుసుకున్నాడు. ఆ వర్గమే దొంగలు,గజదొంగలు.
వాళ్లు కూడా మనుషులే,పుట్టుకతో ఏ ఒక్కరూ దొంగ గా మారాలని అనుకోరు.అలాంటి దొంగలను, గజదొంగలను  కూడా మామూలు మనుషులుగా మార్చాలని అశోక సామ్రాట్ రాజుగారు నిర్ణయించుకున్నారు.ఆ విషయాన్ని పెద్ద పెద్ద శిలా ఫలకాల మీద  ఈ విధంగా రాయించారు.
” ఇందుమూలముగా  ప్రజలందరికీ తెలియ జేయునది, రాజ్యం సుభిక్షంగా ఉండడం కోసం అన్ని రకాల దొంగలను  వారు చేసిన తప్పులను క్షమించి సాధారణ ప్రజాజీవనంలో వారిని మమేకం చేయాలని అశోక సామ్రాట్ మహారాజు గారు పెద్దమనసుతో  నిర్ణయించుకున్నారు. ఈ సదవకాశాన్ని అలాంటి దొంగలు ఉపయో గించుకొని ఇది ఒక సువర్ణావకాశంగా భావించవలసినదిగా కోరడమైనది.ఈ విషయాన్ని అందరూ అందరికీ చేరవేయండి.
 ఇటువంటి శిలాఫలకాలు రాజ్యపు అన్ని కూడళ్ళ లో.అందరికీ కనపడే లాగా ఏర్పాటు చేశారు ఆ రాజ్యంలో. దాంతో చాలా మంది చిన్న పెద్ద దొంగలు, గజదొంగలు రాజుగారి ఆస్థానానికి వచ్చి రాజుగారి చేత మన్నింపబడి ఆయన కృపకు పాత్రులై.ఆ రాజ్యంలోనే క్షేమంగా జన జీవనాన్ని సాగిస్తూఉన్నారు. కానీ ఇంకా ఒకరుఇద్దరూ కరడు గట్టిన గజ దొంగలు  లొంగుబాటు లోకి రాలేదని రాజు గారికి వేగుల ద్వారా సమాచారం తెలిసింది.
ఒక రోజు మిగిలిన వాళ్లలో రామదత్తుడు అనే  మొండి గజదొంగ.  తాను మామూలు మనిషిగా మారి పోవాలని  పూర్తిగా నిశ్చయించుకొని సరాసరి రాజసభకు వచ్చేశాడు.
” మహారాజా నేను ఇంతకాలం దొంగతనాలు చేస్తూ నా కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాను. తప్పో ఒప్పో ఇన్నాళ్ళు నేను చేసిన తప్పి దాలను పెద్దమనసుతో  మన్నించి ,నాకు మామూలు జీవన విధానం తో బ్రతికే అవకాశం కల్పించ వలసినదిగా  శిరస్సు వంచి కోరుకుంటున్నాను. “అంటూ సవినయంగా విన్నవించుకున్నాడు.
రాజుగారు చాలా ఆనందపడ్డాడు. మనిషిలో మానసిక పరివర్తనకు మించిన శిక్ష ఉండదని.తద్వారా  ఆ దొంగను  క్షమించి విడిచి పెట్ట వచ్చునని నిశ్చయించుకొని..ఇలా అడిగాడు.
” ఓయి దొంగ,నీ పేరు..”
” మహారాజా నా పేరు,రామదత్తుడు.
” సరే ,నీకొక పరీక్ష పెడతాను  ఆ పరీక్షలో నెగ్గితే నువ్వు కోరినట్టే చేస్తాను.”  అన్నాడు అశోకుడు గంభీరంగా అలా అంటూ ఒక చిన్న  కడియాన్ని దొంగకు అందిస్తూ
”  ఈ క్షణం నుండి దొంగతనాలు మానేసి 30 రోజుల తర్వాత “ఇదే కడియం” పట్టుకొని మా దగ్గరికి రా .ఇది  నీ మానసిక బలానికి, పరి పక్వత కు సంబంధించిన ఒక చిన్ని పరిశీలన మాత్రమే. మా రాజ్యం లోని ఉత్తరాన గల శాంతిమందిరంలో నువ్వు  భార్యబిడ్డ లతో హాయిగా నివసించవచ్చు నీ జోలికి ఎవరూ రారు”అంటూ,  ఆజ్ఞాపించాడు సామ్రాట్ అశోకుడు.
రామదత్తుడు మహదానందంగా ఆ  కడియాన్ని  అతి జాగ్రత్తగా తన భుజపు ఉత్తరీయం లో మూటగట్టి ఒక సంచిలో చాలా జాగ్రత్తగా భద్ర పరుచుకొని వెనుదిరిగాడు.రామదత్తుడు ఆ రాజ్యంలోని  శాంతి మందిరంలో భార్యాబిడ్డలతో తల దాచుకుంటూ చిన్నపని చేసుకుంటూ జీవనం  కొనసాగిస్తున్నాడు.
.20 రోజులు గడిచిపో యింది. రాజు ఆస్థానానికి వెళ్లి రాజుగారిని కలిసే సమయం దగ్గర పడుతోంది.ఉన్నట్టుండి  రామదత్తుడికి ఒక ‘అనుమానం’ వచ్చి పడింది. అది పెనుభూతమై కూర్చుంది.’ తాను నివసించే సత్రంలో చాలా మంది జనం ఉండేవారు.
ఈ 20 రోజులలో  తాను  సత్రంలో లేనప్పుడు.తను రాజుగారు  ఇవ్వగా భద్రంగా పాతబట్టల  సంచిలో దాచిన  ఆ కడియాన్ని ఎవరైనా తస్కరించారా??.’ అన్న అనుమానం కలిగింది. వెంటనే మూట విప్పి చూశాడు. కడియం తను పెట్టిన చోట భద్రంగా ఉంది.’హమ్మయ్య’ అని ఊపిరి   పీల్చాడు.
మరో వారం గడిచింది,రామ దత్తుడికి మరో అనుమానం కలిగింది. అది పీక్కుతినే బ్రహ్మరాక్షసిలా అతని నెత్తిమీద కూర్చుంది! ” ఏమో తను లేనప్పుడు ఎవరైనా ఆ కడియాన్ని  తీసేసుకుని.అదే స్థానంలో నకిలీ కడియం పెట్టా రేమో  ఏమో ఎందుకైనా మంచిది, ఒకసారి స్వర్ణకారుడు దగ్గర పరిశీలన చేసి చూస్తే తెలిసి పోతుంది కదా అనుకొని పక్కనే ఉన్న వీరాచారి గారికి చూపించాడు.
చారిగారు  దానిని  గీటుపెట్టి నిశితంగా పరిశీలించి “అబ్బే. అబ్బే.ఇది బంగారపుది కాదు.నకిలీది .ఇత్తడి  కడియం అంటూ తేల్చి చెప్పేశాడు.
 రామదత్తుడి గుండెలో బండరాయి పడినట్టు అయ్యింది గాబరా పడిపోయాడు కంగారు  పడిపోయాడు..
” అమ్మో ఇక రెండు రోజులే సమయం.ఈ నకిలీ దాని స్థానంలో అసలు సిసలైన బంగారు కడియం ఎలా పెట్టాలి”.అంటూ చాలాసేపు ఆలోచించాడు..
“ఏముంది కడియం చిన్నదే కనుక  పెద్ద రేటు  ఉండకపోవచ్చు.ఈ నెల రోజులలో తను కూడ బెట్టిన డబ్బుతో దానిని సులభంగా  కోనవచ్చు”
అని మనసులో నిర్ణయించుకున్న రామదత్తుడు
నకిలీ  ఇత్తడి కడియాన్ని   చేతపట్టుకొని.. తనకు తెలిసిన వారి దగ్గర కూడా కొంత డబ్బు తీసుకుని,తన దగ్గర డబ్బు కూడా పోగుపెట్టి పరుగు పరుగు న   అంగడికి వెళ్లి అదే మాదిరి అసలు సిసలు బంగారు కడియాన్ని వెతికి వెతికి చివరికి  కొని తన దగ్గరి నకిలీ  ఇత్తడి కడియాన్ని చెరువులోకి   గిరాటు పెట్టాడు.
“హమ్మయ్య” అని ఊపిరి పీల్చుకుని రెండు రోజులు గడిచాక రాజు గారి ఆస్థానానికి వెళ్ళాడు.రాజు గారు  రామదత్తుడుని పిలిచి అతని దగ్గర కడియం తీసుకొని అటు ఇటు తిప్పి చూసి  అనుమానం వచ్చి రాణి వారికి బంగారు ఆభరణాలు చేసే  విరూపాక్షఆచారిగారి చేత.పరిశీలింపచేయించి అది బంగారు ది అని  అసలు సిసలైన పదహారణాల బంగారపుది  అని తెలుసు కున్నాడు.
రాజుగారు వెంటనే కోపంతో పైకి లేచి.”మూర్ఖుడా నువ్వు మామూలు మనిషిగా మారా వేమో కానీ నిజాయితీ మనిషిగా మాత్రం  మారలేదు.” అంటూ గర్జించారు.నేను ఇచ్చింది ఇత్తడి కడియం నేను నీకు నకిలీ ఇత్తడి కడియమే ఇచ్చాను. కానీ నేను ఇచ్చినది మార్చి నువ్వు “బంగారపు” కడియం తెచ్చావు.
ఆ రోజు నేను నీకు ఇది ” బంగారు కడియం” అని చెప్పలేదు కదా.ఇది  నీ మానసిక బలానికి, పరిపక్వత కు సంబంధించిన ఒక చిన్ని పరిశీలన మాత్రమే. అని విపులంగా వివరించాను కదా మరెందుకు కంగారుపడి  కడియాన్ని మార్చావు. పైగా నేను నీకు ఇచ్చిన అసలు కడియం ఎవరో దొంగిలించారు.అని నువ్వు   అనుమానపడటం.
ఈ రాజ్యపరి పాలన పట్ల నీకు  సరి అయిన అవగాహన లేదనడానికి నిదర్శనం.ఇక్కడ ఇంకా  చిల్లరమల్లర దొంగలు అలాగే ఉన్నారు అని నువ్వు భావించడం.నీలో కరుడుగట్టిన దొంగ బుద్ధి ఇంకా పూర్తిగా పోలేదు అనడానికి మరో  నిదర్శనం.ఇవన్నీ నువ్వు “మారిన మనిషి” గా నాకు చూపించడం లేదు.
ఇది రాజద్రోహం మా రాజ్యంలో కష్టపడే వారితో పాటు,నిజాయితీ స్వచ్ఛత మనస్సు వారు మాత్రమే ఉండవలసి ఉన్నది. కానీ నువ్వు అందుకు విరుద్ధంగా అనుమాన బీజంతో భయాందోళనలకులోనయి నేనిచ్చిన  కడియం  మార్చేసావు.
దొంగతనాలు దోపిడీలు చేస్తూ  బ్రతికిన ఏ మాత్రం తప్పులేదు కానీ ప్రతి నిమిషం ఇలా ఇలా భయాందోళనతో  భీతితో  అనుమానంతో తన నిజాయితీ మీద తనకే నమ్మకంలేని అసహ్యం బ్రతుకు బ్రతకడం చాలా పెద్ద నేరం.ఒక దొంగ కన్నా నీలాంటి నిబ్బరమైన మనసు లేని వ్యక్తుల వల్లే ఈ రాజ్యానికి ప్రమాదం.ఎక్కువ అందుచేత నిన్ను పూర్తిగా క్షమించలేను.
నీకు వేసే శిక్ష ఏమిటంటే ఒక సంవత్సరం నువ్వు రాజ్యం బయట ఉన్న మానసిక శిక్షణ రాజప్రాంగణాల్లో అక్కడివారు శిక్షణలో గడపవలసి ఉంది. తదుపరి మాత్రమే నీకు రాజ్య ప్రవేశము.
అంత దనుక నీ భార్యాబిడ్డల బాధ్యత ఈ రాజ్య అధికారుల పర్యవేక్షణలో సుభిక్షంగా ఉంటుంది.
అంటూ రాజుగారు హుకుం జారీ చేసి గంభీరంగా కూర్చున్నారు తన సింహాసనం మీద తాము సుఖాసీనులై అయ్యారు.
సభలో అంతా గ్రహిస్తున్న మామూలు ప్రజానీక మంతా ముక్కున వేలువేసుకున్నారు. రామదత్తు డి తికమక ఆలోచనకు అతడిని నిందించారు.
వెంటనే రామదత్తుడుని అక్కడి  భటులు మానసిక శిక్షణ  రాజప్రాంగణానికి  పంపించేశారు. చివరలో రాజుగారు  భవిష్యత్తు లో ఇక తను యుద్ధం చేయకూడదని నిర్ణయించుకోవడానికి కూడా ఇలాంటి సంఘటనలు దోహద పడ్డాయి.
ఇలాంటి “మానసిక శిక్షణ రాజ ప్రాంగణాలు”అనుభవం కూడా నేర్పాయి.అందుకనే అశోకుడు “సామ్రాట్’ అయ్యాడు.

Leave A Reply

Your Email Id will not be published!

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!