Favorite Politician (PV Narasimha Rao) : పాములపర్తి వెంకట నరసింహారావు
నచ్చిన రాజకీయ నాయకుడు
పాములపర్తి వెంకట నరసింహారావు
పాములపర్తి వెంకట నరసింహా రావు మనందరికీ పి.వి.నరసింహారావు గా పరిచయం.ఆయన ఒక మహా జ్ఞాని. అపర చాణిక్యుడు అనడంలో అతిశయోక్తి లేదు.తెలంగాణా లోని వరంగల్ జిల్లాలో నర్సంపేట్ మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28న రుక్నాబాయి, సీతారామారావు దంపతులకు జన్మించాడు.
విద్యాభ్యాసం ప్రాథమికంగా వరంగల్ జిల్లాలో మొదలు పెట్టాడు. పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు అతన్ని దత్తత తీసుకున్నారు. వారు కరీంనగర్ జిల్లా వాసులు అవడం మూలంగా ఆయన కరీంనగర్ జిల్లా పాఠశాలలో చేరవలసి వచ్చింది.
చిన్నతనం నుంచే ఆయనకు నాయకత్వ లక్షణాలు అలవడినవి. 1938 లో హైదరాబాదు కాంగ్రెస్ పార్టీలో చేరి నిరంకుశ నిజాం ప్రభుత్వాన్ని నిరసిస్తూ వందేమాతర గీతం పాడాడు.
అదే అదనుగా ఆయన చదువుతున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరింపబడ్డాడు. ఓ మిత్రుడి సహాయంతో ఇంటినుండే చదివి పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాడు. ఆ తరువాత నాగ్ పూర్ లోని బాంబే యూనివర్సిటీలోను, పుణెలోని పెర్గు సన్ యూనివర్సిటీ నుంచి న్యాయవాద విద్యను అభ్యసించారు.
స్వామి రామానందతీర్థ, బూర్గుల రామకృష్ణారావు అనుయాయిగా స్వతంత్ర పోరాటంలోను, హైదరాబాదు విముక్తి పోరాటంలోను పాల్గొన్నాడు. బూర్గుల శిష్యుడిగా కాంగ్రెస్ నాయకుడు మర్రి చెన్నారెడ్డి, శంకరరావు చవాన్ ,వీరేంద్ర పాటిల్ లతో కలిసి పనిచేశారు. అఖిల భారత కాంగ్రెస్ సభ్యునిగా 1951లో స్థానం పొందాడు.
నరసింహారావు మొదట జర్నలిస్ట్ గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ‘కాకతీయ’ అనే పత్రికను నడుపుతూ ‘జయ’ అన్న మారు పేరుతో 1950 ప్రాంతాలలో వ్రాసేవారు. ఎన్నో భాషలను నేర్చి అన్నిటిలోనూ నిష్టాతుడుగా నిలిచాడు.ఆంధ్ర రాష్ట్రాలలో 1957 నుంచి 1977 వరకు ఎమ్మెల్యే గా పనిచేశాడు.
కాంగ్రెస్ నుంచి ఇందిరాగాంధి కాంగ్రెస్ ఏర్పడినప్పుడు ఆయన మద్దతుగా నిలిచారు.ఆంధ్ర ప్రదేశ రాష్ట్ర రాజకీయాలలో ఎన్నో కీలకమైన భాధ్యతలను 1962 -73 వరకు పోషించారు. అటు పిమ్మట 1972 లో మొదటిసారి లోక్ సభకు ఎన్నికయ్యారు.
రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1977 నుండి 1984 వరకు లోక సభ సభ్యునిగా ఉన్నారు. 1984 లో రామ్ టెక్ నుంచి
మళ్ళీ లోక్ సభకు ఎన్నికయ్యారు.
విదేశాంగ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, అనంతరము 1985లో మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
1968 నుంచి 1974 వరకు నరసింహారావు తెలుగు అకాడమీ చైర్మెన్ గా వ్యవహరించి తనకు కేవలం రాజకీయాలలోనే కాదు భాషా, సాహిత్యం
పట్ల కూడా మక్కువ ఉంది అని నిరూపించారు.
సినిమా అన్నా, నాటకాలు అన్నా పిచ్చి ఇష్టం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలపట్ల ఎనలేని గౌరవంతో నాటి పురాణ గ్రంథాలు అన్నీ ఔపోషణ పట్టారు. హిందీలో కవితలు వ్రాసారు.
జ్ఞానపీఠ్ ప్రచురించిన విశ్వనాథ్ సత్యనారాయణ రచించిన వేయిపడగలు నవలను హిందీ అనువాదాన్ని ‘సహస్ర శ్రఫణ్’ పేరిట విజయవంతంగా ప్రచురించారు. ప్రముఖ హింది రచయిత హరినారాయణ్ అప్టే ప్రముఖ మరాటీ నవల ‘పన్ లక్షత్ కోన్ గెటో’ తెలుగు అనువాదాన్ని కూడా ప్రచురించారు.
మరాటీ నుంచి హిందీలోకి, హిందీలో నుంచి తెలుగులోకి ఎన్నో అనువాద నవలలను ప్రచురింపజేశారు. మరెన్నో పత్రికలలో కలామ్ పేరుమీద వ్యాసాలు రాసేవారు.
అమెరికా, పశ్చిమ జర్మనీ దేశాల్లోని రాజకీయ అంశాలపై కూడా తమ అభిప్రాయాలను వ్యాసాల రూపంలో రాశారు. విదేశీ వ్యవహారాల మంత్రి హోదాలో అమెరికా, జర్మనీ, ఇటలీ, బ్రిటన్, స్వీజ్జర్లాండ్, ఈజిప్ట్ దేశాల్లో పర్యటించారు.
విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలో అంతర్జాతీయ దౌత్యానికి సంబంధించి ఆయన తన మేథావితనాన్ని, ప్రజ్ఞా పాటవాలను, రాజకీయ అనుభవాన్ని సమయోచితంగా ప్రదర్శిస్తూ వచ్చారు.రాజీవ్ గాంధి అకాల మరణంతో వెంటనే పి.వి నరసింహారావు ని పదవ భారత ప్రధానిగా ఎన్నుకోబడ్డారు.
అప్పటికే భారత ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోవటంతో ఆయన దేశ రాజకీయ, సామాజిక పరిస్థితులను ఎంతగానో చక్కబెట్టారు. ఎన్నో మార్పులను తీసుకువచ్చారు. ఆయన నూతన ఆర్థిక సంస్కరణలే దేశంలో ఈనాడు టెక్నాలజీ వినియోగం పెరగడానికి తోడ్పడింది.
పి వి నరసింహారావు 1996 లో జరిగిన ఎన్నికలలో ఘోరంగా ఓడిపోవడంతో ఇక రాజకీయాలలో ఉండడని నిర్ణయం తీసుకున్నారు ప్రధాని పదవి నుండి తప్పుకుని,ఆ సమయంలోనే అనేక ఆరోపణలు, అందులో 1993లో లంచం తీసుకున్నట్టు కోర్టులో కేసు కూడా నడిచింది.
పి వి నరసింహారావు 2004 లో గుండెపోటుకు గురి అయి ఏఐఐఎమ్స్ లో చికిశ్చ పొందుతూ తన 84వ ఏట తుది శ్వాస విడిచారు. చివరికి ఆయనను ఖననం చేయటంలో కూడా పెద్ద వివాదం చెలరేగింది. ఢిల్లీలో చేయాలని కుటుంబ సభ్యులు కోరగా అహమ్మద్ పటేల్ దానిని వ్యతిరేకించి భౌతికకాయాన్ని హైదరాబాదుకు తరలించారు.
మౌన ముద్రాంకితుడు, నిశ్శబ్దంగా కనిపించే పీవీ లో హాస్యచతురత లేదు అనుకుంటే పొరపాటే అంటారు ఆనాటి వారు.ఒకసారి తనను కలసిన కొందరు పాత్రికేయులతో ఆయన ఆఫ్ ది రికార్డ్ ముచ్చట్లు చెబుతున్నప్పుడు.
ఉద్యోగం లేకుండా ఏవో ఉద్యమాలలో తిరుగుతూ ఉండే ఒక యువకుడి ప్రస్తావన వచ్చిందట. ఆ యువకుడు పీవీకి కాస్త దగ్గరి బంధువు కూడా. “పాపం అతగాడు ఏ ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నాడు.
అతనికి తెలుగు అకాడెమీలో ఉద్యోగం ఇప్పించకూడదా?” అని పీవీతో చనువున్న ఒక పాత్రికేయుడు అన్నాడట. అప్పుడు పీవీ, “అదెట్లా కుదురుతుందయ్యా? అందులో పండితులు పనిచేస్తారట కదా?!” అన్నారట.
తెలుగు గడ్డ మీద పుట్టి ప్రధాన పీఠాన్ని అధిష్టించిన ఘనుడు పి వి .రాజకీయ చతురుడై మరణశయ్యపై నిలిచిన ఆర్ధిక వ్యవస్థను పునర్మించి
రాజనీతిలో తనకు తానే మేటి అనిపించుకున్నారు పీవి.పివి నరసింహారావు ఏ పదవి చేపట్టినా దానికి వన్నె తెచ్చారు. తన రాజనీతిజ్ఞతతో అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నారు.
మాజీ ప్రధానులందరికీ దేశ రాజధాని ఢిల్లీలో స్మృతివనాలు ఉన్నా. పీవీకి అలాంటి గౌరవం దక్కకపోవడం విచారకరం. మార్పు వల్ల సమాజంలో మంచి జరగాలని పీవీ కోరుకునేవారు. అది జరిగేలా చూడటమే పీవీకి మనమిచ్చే ఘన నివాళి. తెలుగు గడ్డపై తెలంగాణా బిడ్డగా ఎదిగి భారత ప్రధానిగా పదోన్నతి పొందినా ఆయన నిగర్వి, మౌన ముని,ఎన్నడూ ఏది ఆశించని అమరజీవి.
Also Read : ప్రతివాది భయంకర వెంకటాచారి